కశ్మీర్ ప్రత్యేక దేశమట.. ప్రశ్నాపత్రంలో బీహార్ స్కూల్ నిర్వాకం

  • ఏడో తరగతి పరీక్షలో ప్రశ్న
  • మానవ తప్పిదమంటూ స్కూల్ వివరణ
  • ప్రశ్నాపత్రం విద్యాశాఖ నుంచే వచ్చిందని వెల్లడి
  • నితీశ్ కుమార్ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొంటూ బీహార్ లో ఓ స్కూలు యాజమాన్యం ప్రశ్నాపత్రం తయారుచేయడం వివాదాస్పదంగా మారింది. ఆ ప్రశ్నాపత్రం రాష్ట్ర విద్యాశాఖ నుంచే వచ్చిందని ఆ స్కూలు హెడ్ మాస్టర్ చెప్పారు. మానవ తప్పిదం వల్లే ఈ పొరపాటు జరిగిందని వివరణ ఇచ్చారు. అయితే, నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీ జనతాదళ్(యునైటెడ్) లు కశ్మీర్ ను మనదేశంలోని భూభాగంగా గుర్తించట్లేదా? అంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీహార్ లోని ఓ స్కూల్ లో ఏడో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ప్రశ్నాపత్రంలో వివిధ దేశాలు, అక్కడ నివసించే ప్రజలను ఏమంటారో చెప్పాలంటూ రెండు మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. ఇందులో చైనా, నేపాల్, ఇంగ్లాండ్, ఇండియాలతో పాటు కశ్మీర్ ను ప్రత్యేక దేశంగా పేర్కొన్నారు. కశ్మీర్ దేశస్తులను ఏమంటారని ప్రశ్న కనిపించడంతో విద్యార్థులు అవాక్కయ్యారు.

ఈ విషయం బయటకు పొక్కడంతో బీజేపీ నేతలు నితీశ్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కాగా, బీజేపీ ఆరోపణలపై జేడీయూ లీడర్ సునీల్ సింగ్ స్పందించారు. కశ్మీర్ మన దేశంలోని అంతర్భాగమని అందరికీ తెలుసని, దేశంలో అందరూ అంగీకరించే విషయమేనని తేల్చిచెప్పారు. ప్రశ్నాపత్రం విషయంలో బీజేపీ నేతలది అనవసర రాద్ధాంతమని కొట్టిపారేశారు.

Jammu And Kashmir
Bihar
7th class exam
separate country

More Telugu News